దేశంలో ఇక ఏ ఎన్నిక జరిగినా అభివృద్ధే ఎజెండాగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దేశ అభివృద్ధి కోసం ఎవరైతే పాడపడతారో వారికే దేశానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని దేశ ప్రజలు పదే పదే విస్పష్టంగా తీర్పునిస్తున్నారని ప్రధాని అన్నారు. బీజేపీని అన్ని చోట్లా ఆదరించిన ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నేతలందరికీ ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ఎన్నికల ప్రక్రియ ప్రజలందరూ గర్వించేలా ఉందని చెప్పారు. బీహార్లో ఎక్కడా రీపోలింగ్ లేకపోవడం, ప్రశాంతంగా ఓటింగ్ జరగడం ప్రత్యేకతలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాతంగా ముగియడానికి కారణామైన ఎన్నికల కమిషన్, రాష్ట్ర అధికారులతో సహా ప్రతి ఒక్కరికీ తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
అంకితభావంతో ఎన్డీయే విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకు కృత్జజ్ఞతలని అన్నారు. బీజేజీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డాను అభినందించారు.