40.2 C
Hyderabad
April 29, 2024 18: 41 PM
Slider జాతీయం

ప్రజలకు వాస్తవ సమాచారం ఇచ్చి భయం పోగొట్టండి

modi media

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ సవాలును ఎదుర్కొనడంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎలక్ట్రానిక్‌ మాధ్యమ ప్రసారకర్తల్లోని కీలక భాగస్వాములతో దృశ్య-శ్రవణ మార్గంద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముందుగా ఈ ప్రపంచ మహమ్మారి ముప్పు తీవ్రతను అర్థం చేసుకుని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కృషిచేస్తున్న అన్ని మాధ్యమాలకూ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు దేశవ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామన్లు, సాంకేతిక నిపుణులు అటు క్షేత్రస్థాయిలో, ఇటు స్టూడియోల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నారంటూ ప్రశంసించారు. అంకితభావం, చిత్తశుద్ధితో కూడిన వారి విధి నిర్వహణను జాతికి చేస్తున్న గొప్ప సేవగా ఆయన కొనియాడారు. కొందరు సిబ్బంది ఇళ్లనుంచే పనిచేసేలా కొన్ని చానెళ్లు వినూత్న ప్రయత్నం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19ను ఒక జీవితకాలపు సవాలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త, ఆవిష్కరణాత్మక పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. మన పోరాటం మున్ముందు కూడా సుదీర్ఘంగా కొనసాగాల్సి ఉందని చెప్పారు.

ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించడంపై అవగాహన పెంచాలన్నారు. అలాగే తాజా పరిణామాలపై సమాచారాన్ని, కీలక నిర్ణయాలను వేగంగా ప్రజలకు చేరవేయాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఇదంతా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ప్రజానీకానికి అందించడంలో వృత్తి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు.

ప్రసార మాధ్యమాలు ఒకవైపు- ప్రజలు స్వీయ రక్షణను విస్మరించి, నిర్లక్ష్యానికి తావివ్వకుండా చూడటమేగాక మరోవైపు- వాస్తవ సమాచారమిస్తూ వారిలో నిరాశావాదాన్ని, భయాందోళనలను పారదోలేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రపంచ మహమ్మారిపై పోరాటంలో ఎంతో సాహసంతో ముందునిలిచి, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిత్యనూతన ఉత్తేజం నింపాల్సిన బాధ్యత కూడా మాధ్యమాలపై ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ప్రసారంలో వార్తా చానెళ్లు కీలక సాధనంగా ఉపయోగపడుతున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.

ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటున్నదని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లకు పొడవాటి గొట్టం చివరన అమర్చిన ప్రత్యేక మైకులను అందించాలని చానెళ్ల యాజమాన్యాలకు ఆయన సూచించారు.

ఆ మేరకు వారు ఇంటర్వ్యూల వంటివి నిర్వహించే సమయంలో ఒక మీటరు సామాజిక దూరం పాటించగలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమాచార ప్రదానంలో శాస్త్రీయ నివేదికలకు ప్రాచుర్యం లభించేలా చూడాలన్నారు.

అవాస్తవాల వ్యాప్తి నిరోధం కోసం బృంద చర్చలలో నిష్ణాతులైన ప్రముఖులను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు. కోవిడ్‌-19పై సానుకూల కథనాలను ప్రత్యేకించి ఆ మహమ్మారి నుంచి విముక్తులైనవారి అనుభవాలను తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని కోరారు.

అలాగే లేనిపోని వదంతుల నివారణకు, వాస్తవాల నివేదనలో రిపోర్టర్లకు మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన డాక్టర్లతో 24గంటలూ పనిచేసే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ మాధ్యమం ప్రసారభారతి ద్వారా రోజుకు రెండుసార్లు ప్రజలకు అధికారిక సమాచారం అందించాలని, దీన్ని ఇతర టీవీ చానెళ్లు కూడా వినియోగించుకనే వీలుందని సూచించారు.

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం సేకరించే విలేకరులు ఆ విషయాలను ఎప్పటికప్పుడు చురుగ్గా తమతో పంచుకోవడంపై ఆ శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం రూపొందించిన ప్రభుత్వ శ్రేణి ప్రభుత్వ వ్యవస్థ సంబంధిత వివరాలను ఆమె వివరించారు.

దీంతోపాటు సవాళ్లను ఎదుర్కొనడంలో సామర్థ్య నిర్మాణం దిశగా నిరంతరం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. వైరస్‌ పీడితులకు పరీక్షల సంబంధిత వ్యూహంలోనూ ఇదేవిధమైన ప్రతిస్పందన విధానాన్ని అనుసరిస్తున్నామని, పరీక్ష ఉపకరణాలకు ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని భారత వైద్యపరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు.

కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రితోపాటు ఆ శాఖ కార్యదర్శిసహా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మాధ్యమ సంస్థల సంపాదకులు, ఇతర సీనియర్‌ ప్రతినిధులు ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

ప్రభుత్వానికి లొంగిపోతే అన్ని విధాలా ఆదుకుంటాం

Satyam NEWS

ఈ బాబుకేమైంది? ఎందుకు మాట్లాడటం లేదు?

Satyam NEWS

Leave a Comment