ఆన్ లైన్ సినిమా టిక్కెట్ ల వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ నిర్మాతలలో విజయవంతంగా చీలిక తీసుకువచ్చింది. కొందరు సినీ నిర్మాతలు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్ముకోవడం పట్ల తమకు అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతును నిర్మాతలు ప్రకటించారు. ఆన్ లైన్ టికెటింగ్ విధానం గతంలో ఉండేది.. అయితే అప్పట్లో ఆప్షనుగా ఉండేది. ఇప్పుడు కంపల్సరీ చేయాలని మేమే కోరాం అని నిర్మాత జీ. ఆదిశేషగిరిరావు అన్నారు.
అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ విధానం ఉంది. ఏపీలో కూడా అమలు జరపాలని కోరాము. ఇండస్ట్రీకి మేలు చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారు అని సమావేశానికి హాజరైన నిర్మాతలు అందరూ అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఆదిశేషగిరిరావు తో బాటు సి.కళ్యాణ్, దిల్ రాజు, డివివి దానయ్య, డి.ఎన్.వి ప్రసాద్, రామ సత్యనారాయణ, ఎన్వీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. సినీ నటి, ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఈ సమావేశం జరిపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించిందని సి.కళ్యాణ్ అన్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాం. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆక్సిజన్ ఇచ్చారు. అతి త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని అన్నారు. సీఎం జగన్ మంచి భరోసా ఇస్తున్నారు. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆయన తెలిపారు.