పి.టి.ఐ.ల సర్వీసు క్రమబద్ధీకరణ, పార్ట్ టైం అనే పదం తొలగింపుపై ప్రభుత్వాన్ని వత్తిడి చేయాలని పి.టి.ఐ.ల సంఘం రాష్ట్ర కోశాధికారి కడప జిల్లా బద్వేలు కు చెందిన చిన వెంకటయ్య సచీవాలయ ఉద్యోగుల సంఘాన్ని కోరారు. ఆదివారం నాడు విజయవాడ గవర్నర్ పేట లోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ని ఆయన కలుసుకున్నారు.
పి.టి.ఐ.ల వేతనాల పెంపు, హాఫ్ డే, ఫుల్ డే, ఉద్యోగ భద్రత, ఫీల్డ్ వర్క్ నుండి మినహాయింపు, ఎక్స్గ్రేషియా, మహిళలకు మెటర్నిటీ సెలవులు, రెగ్యులర్లతో సమానంగా సాధారణ సెలవులు వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించేలా చూడాలని ఆయన కోరారు. ఈ సమస్యలను ఆయన సచీవాలయ ఉద్యోగుల సంఘం నేతలకు వివరించారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరగా రాష్ట్ర నాయకులు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సంబంధిత అధికారులను ఈ విషయంలో కలసి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.