పాకిస్తాన్ లో పబ్జీ గేమ్ పై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ మేరకు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సమయం వృధాకావడం, దానికి బానిసలుగా మారిపోవడం తదితర కారణాలతో ఈ గేమ్ ను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా పిల్లల్లో ఈ గేమ్ కారణంగా విపరీతమైన మానసిక పరివర్తన జరుగుతున్నదని, దీనివల్ల వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నదని పిటిఏ తెలిపింది.
ఈ గేమ్ కారణంగా పిల్లల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కూడా పిటిఏ వెల్లడించింది. ఈ గేమ్ ను బ్యాన్ చేయాలని లాహోర్ హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశించింది. అయితే తుది విచారణ ఈ నెల 9న జరుగుతుంది. ఈ గేమ్ వల్ల జరుగుతున్న విపరీత పరిణామాల కారణంగా గేమ్ ను బ్యాన్ చేయాలని కొద్ది కాలం కిందట లాహోర్ కాపిటల్ సిటీ పోలీసు అధికారులు కూడా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.