తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.
ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. టిటిడి మహిళా ఉద్యోగులతోపాటు మహిళలు పాల్గొని రథాన్ని లాగారు.
ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు.
డిసెంబరు 26న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 26న శనివారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం జరుగనుంది.