ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఒక్కొక్కటిగా గుర్తు చేస్తున్నారు.
అందులో భాగంగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదని ఆయన నేడు గుర్తు చేశారు. ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చినట్లు రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారని చెప్పారు.
గ్రామ సచివాలయాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పశుసంవర్ధక శాఖలో 6,100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 18వేల ఉపాధ్యాయ, ఆరు వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఉద్యోగాల భర్తీ చేయకుండా వదిలేశారని, వందల సంఖ్యలో సెక్రటేరియల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామని సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. అత్యవసరంగా పరిగణించి వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.