నెలవంక కనిపించడంతో రంజాన్ సందడి ప్రారంభం అయింది. నెలవంక దర్శనంతో మసీదుల్లో సైరన్లు మోగాయి. దాంతో నేటి నుంచి తరావి నమాజులు ప్రారంభం అయ్యాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస దీక్షలు మొదలు పెడతారు.
రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపి సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని అన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారన్నారు.
ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తూ.. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని ఆయన అన్నారు.