అభ్యుదయ రచయిత సింగమనేని నారాయణ స్మారకార్థం నిర్వహిస్తున్న రాయలసీమ కథల పోటీలను జయప్రదం చేయాలని వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం వ్యవస్థాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేర్కొన్నారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాల జీవన క్రమంలో ముప్పాతిక పై భాగం సాహిత్యజీవిగా కొనసాగి తాను నమ్మిన ఆశయాల కోసం జీవితాంతం నిబద్ధతగా సింగమనేని నిలబడ్డారని పేర్కొన్నారు.
ప్రజాస్వామిక, శాస్త్రీయ, సమసమాజ భావనలకు ఆయన రచనలు అద్దం పడతాయి. సీమ ప్రాంతీయ నిర్దిష్ట జీవితాన్ని, భాషను తన కథల్లో చిత్రించడంతో పాటు, “సీమ కథలు” అనే కథల సంకలనం కూడా వెలువరించి సీమ జీవన సంఘర్షణను ప్రపంచానికి పరిచయం చేసారని తెలిపారు.
సింగమనేని గారి కథా సాహిత్య కృషికి గుర్తుగా రాయలసీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం పక్షాన రాయలసీమ కథల పోటీలను నిర్వహించి పదివేల రూపాయల బహుమతులు ఇస్తామని నిర్వాహక బృంద సభ్యులు పి.రాజశేఖరరెడ్డి, యస్.వాసంతి, జె.నిర్మల, యం.రవికుమార్ ప్రకటించారు.
రాయలసీమ నిర్దిష్ట జీవనగతులు ఇతివృత్తంగా, కథా ప్రక్రియ లక్షణాలను అనుసరించి, కొత్తగా రాసిన కథలను 31 మే 2021 లోగా దిగువ చిరునామాకు పంపాలి.
# వై. శైలజ, 13-2-7, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ పక్క వీధి,రామచంద్రనగర్,
అనంతపురము, పిన్: 515001.
seemakathalu@gmail.com వివరములకు ఈ నెంబరుకు 9963917187 సంప్రదించాలని కోరారు