బిచ్కుంద మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎరువులు పురుగుల మందులు విత్తనములు డీలర్లతో శనివారం ఉదయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకే డీలర్లు విత్తనములు ఎరువులు విక్రయించాలన్నారు. ప్రతి రైతుకు వారు కొన్న ఎరువులకు విత్తనాలకు బిల్లులు కచ్చితంగా ఇవ్వాలన్నారు. లేని ఎడల తీవ్రమైన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.
కల్తీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రైతుల అభివృద్ధి ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలు ఎరువులు విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తోపాటు వ్యవసాయ అధికారి పోచయ్య గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్ష మండల ఎరువులు విత్తనాల పురుగు మందుల దుకాణం డీలర్లు పాల్గొన్నారు.