పోలీసు అధికారాలను అడ్డంపెట్టుకొని దళిత నాయకుడిపై దాడి చేసిన కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకట రమణ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత, బహుజన ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. ప్రజాసంఘాల నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మీసాల రాము, పుట్టపాక రాము, తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్ ఈ మేరకు డిమాండ్ చేశారు.
గురువారం నాడు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో దళిత వ్యవస్థాపకుడు, రామాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజును స్థానిక ఎస్ఐ జి. బాల వెంకటరమణ అవమాన పరచి, దాడి చేశారని వారన్నారు. దళితులను కులంపేరుతో అవమానించిన ఎస్ఐ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడంతో శుక్రవారం నాడు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బాధితుడు బచ్చలకూర బాలరాజు నిరసన తెలిపారు.
ఆయన నిరసనకు భారీ సంఖ్యలో దళిత, బహుజన ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళిత దండు వ్యవస్థాపకుడు, ఒక మాజీ సర్పంచ్ అయినా బచ్చలకూర బాలరాజుపై ఎస్ఐ జి. బాల వెంకటరమణ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ లో మీసాలు తిప్పుతూ,తొడలు కొట్టి ప్రజలను భయపెట్టడానికి స్టేషన్ ఎస్ఐ అబ్బ జాగీరు కాదని హెచ్చరించారు.
చట్టాలను కాపాడడానికి ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీస్ స్టేషన్ లు ఉన్నాయని అన్నారు.ఎస్ఐ ఈసంగతి మరిచిపోవద్దని చెప్పారు. దళితులనే టార్గెట్ చేస్తూ ఎస్ఐ దాడి చేస్తున్నారన్నారు. ఇది వరకు దళిత రిపోర్టర్ పై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు పంపిన అంశంపై రిపోర్టర్ అంబెడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
వారికి బచ్చలకూర బాలరాజు, దళిత నాయకులు అండగా నిలిచినందుకు వారిపై ఎస్ఐ దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం గల దేశంలో ప్రతి ఒకరికి స్వేచ్ఛ హక్కు ఉందన్నారు. హక్కులకు భంగం కలిగిస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. స్టేషన్ కు ఫిర్యాదుదారునీ వెంట వస్తె కక్షపూరితంగా దళిత నాయకుడని తెలిసి కూడా చొక్కా పట్టుకొని నాన్న బూతులు తిడుతూ, కొట్టుకుంటూ బయటికి నెట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీస్ స్టేషన్ అంటే మాకు గౌరవం, చట్టాల పై నమ్మకం ఉందనారు. రౌడీ ఇజం చేయాలి అనుకుంటే పోలీస్ యూనిఫాం ఇప్పి రౌడీయిజం చేస్తే కనిపిస్తుందన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా కానీ సిగ్గురావడం లేదన్నారు. ఎస్ఐ జి.బాల వెంకట రమణ ను వెంటనే సస్పెండ్ చేసి,అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని పసుపుల నరసింహ, మీసాల రాము, మద్దెల రాందాసు ప్రజా సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ హెచ్చరించారు. ఓవైపు ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంది కానీ దళితులపై దాడులు పెరిగిపోయాయని మీసాల రాము అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు.