బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుతో లింక్ ఉన్న మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన సినీ నటి రియా చక్రవర్తికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది.
ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తితో బాటు ఆమె సోదరుడు షోవిక్ ను కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ (ఎన్ సి బి) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రత్యేక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయ మూర్తి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు.
వీరిద్దరితో బాటు మరో నలుగురు వ్యక్తులు కూడా అరెస్టు అయ్యారు. ప్రత్యేక న్యాయ స్థానం తమ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం పై తదుపరి చర్యలు తీసుకుంటామని రియా న్యాయవాది సతీష్ మాన్ షిండే తెలిపారు.
కోర్టు ఆదేశాల కాపీ తమకు ఇంకా అందలేని ఆయన వెల్లడించారు. వచ్చే వారం లో ముంబయి హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.
తనను తప్పుడు కేసులో ఇరికించారని రియా చక్రవర్తి కోర్టులో చెప్పారు. పోలీసులు తన పై వత్తిడి తీసుకువచ్చి తాను నేరం చేసినట్లు అంగీకరించే విధంగా చూస్తున్నారని ఆమె తెలిపారు.
సుశాంత్ రాజ్ పుత్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నాడనే విషయం తమ పరిశోధనలో వెల్లడి అయిందని, అదే విధంగా సుశాంత్ కు మాదక ద్రవ్యాలను రియా తీసుకువచ్చేదని వారు ఆరోపించారు.
ఆ మాదకద్రవ్యాలు అమ్మేవారికి రియా చక్రవర్తి పేమెంటు కూడా ఇచ్చేదని పోలీసులు తెలిపారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి మాదక ద్రవ్యాలు అమ్మేవారితో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.