ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల వెలుగు చూసిన భారీ (8400 క్వింటాళ్ల) బియ్యం కుంభకోణం పై పలు అనుమానాలు ఉన్నాయని భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ రోజు కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజాకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు.
అసలు MLS పాయింట్ కు బియ్యం రాకపోయినా వచ్చినట్లు చూపెట్టి రూ.3 కోట్ల బిల్లులు చెల్లించారని ఆరోపించారు. పెద్ద తలకాయలను వదిలేసి చిన్నపాటి అధికారులను సస్పెండ్ చేయడంతో అసలు విషయం తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. పథకం ప్రకారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ 8400 క్వింటాళ్ల బియ్యాన్ని తన అన్నదాన సత్రం కోసం మళ్ళించారని ఆరోపించారు.
ఈ బియ్యం కుంభకోణానికి కర్త – కర్మ – క్రియల్లో, కర్త: సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అని, కర్మ:మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ అని, క్రియ:మాత్రం అధికారులని దుయ్యబట్టారు. విజిలెన్స్ & ఎన్ ఫోర్సు మెంట్ అధికారులు రోటీన్ గా తనిఖీ చేస్తేనే ఒకే MLS పాయింట్ లో ఇంత భారీ కుంభకోణం బయటపడిందని, అన్ని MLS పాయింట్ లలో కూడా విసృత తనిఖీలు చేసి మొత్తం అవినీతిని బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక MLS పాయింట్ లో ఇంత పెద్ద కుంభకోణం జరగలేదని,మొదటిసారి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో,అందునా సిర్పూర్ మండలంలోని రైస్ మిల్లు నుండి ఈ మొత్తం కుంభకోణం నడిచిందని తెలియజేశారు. ప్రజాసేవ అనే ముసుగులో అక్రమార్జనకు కోనేరు కోనప్ప పాల్పడుతున్నారని, వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులైన ప్రజాప్రతినిధులు మరియు అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ మీడియా సమావేశంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ఈర్ల విశ్వేశ్వర్, సిందం శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, రాజేందర్ జాంజోడ్, డోంగ్రి అరుణ్, అనిల్ కుమార్, జాడి దీపక్, కొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.