తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి రూ.150 కోట్లు విడుదల అయినట్లు ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రూ.150 కోట్లు ఖర్చు చేసి 20 కొత్త రోడ్లు మూడు హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని ఆయన వెల్లడించారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తాను చేసిన వినతికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి కూడా మంజూరు చేయించడంలో చొరవ చూపారని ఆయన తెలిపారు. వారిద్దరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులలో బిజ్జురు మండలం లోని కుష్ణాపల్లి నుండి బిజ్జురు రోడ్ పై 10.0 కోట్లతో, చింతలమనేపల్లి మండలం లో (02) హైలెవెల్ బ్రిడ్జి లు రూ 6 కోట్లతో మంజూరు చేశారు. ఈ పనుల మంజూరు వాల్ల నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలలో సత్వర అభివృద్ధి చోటు చేసుకుంటుంది. ఈ రోడ్లు, బ్రిడ్జి ల మంజూరుతో మారుమూల గ్రామాల అభివృద్ధి జరుగుతుంది.