ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా 5100 బస్సు రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కూడా సీఎం తెలిపారు. అంతులేని కోరికలతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వ లో విలీనం చేయబోయేది లేదని కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపిస్తున్నాయని ఆ విషయం కార్మిక సంఘాలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆరు నూరైనా క్యాబినెట్ నిర్ణయం పై ఎలాంటి మార్పులు ఉండవు అని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 బస్సులు పని చేయడం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మాట పట్టుకొని ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో కొనసాగుతున్నారని ఇప్పటికైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు నిలుపుదల చేయాలని ఆయన అన్నారు. కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చట్టవిరుద్ధమని లేబర్ డిపార్ట్మెంట్ చెప్పినా కార్మికులు వినలేదని, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని జీతాలు ఆర్టీసీ కార్మికులకు తాము ఇస్తున్నామని ఆయన అన్నారు. టీఆరెస్ ప్రభుత్వం అందరికి న్యాయం చేసే విధంగా జీతాలు ఇస్తుంది..పెంచింది అని స్పష్టం చేశారు. 49 వేల మంది కార్మికులు ఉన్నారు. కార్మికుల పొట్టకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దు. నవంబర్ 5వ తేదీలోగా కార్మికులు అందరూ డ్యూటీలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
previous post