సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులలో కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు యాజమాన్యానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కిలో మీటర్ కు 20 పైసల చొప్పున బస్ చార్జీలు పెంచడం ద్వారా రూ.750 కోట్లు సమీకరించి ఆర్టీసీ బలోపేతానికి ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అదే విధంగా ఆర్టీసీ పునరుజ్జీవం కోసం రేపే రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు.
నాలుగైదు రోజుల్లో ప్రతీ డిపో నుంచి 5-7 కార్మికులను పిలిచి ప్రగతిభవన్లో మాట్లాడతానన్నారు. యూనియన్ల స్థానంలో ప్రతీ డిపోలో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, మీరు బాధపడాలని తామెందుకు భావిస్తామని ప్రశ్నించారు. కార్మికులను కాదని తాము నిర్ణయం తీసుకోమని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.