విశాఖ నుంచి పాలన సాగిస్తే తప్ప మళ్లీ తనకు మంచి రోజులు రావని కచ్చితంగా భావిస్తున్న సీఎం జగన్ ఎవరు వద్దన్నా తన ప్రయత్నాలలో మునిగిపోయి ఉన్నారు. విశాఖ పట్నం నుంచి పాలన ప్రారంభిస్తే తిరుగు ఉండదని రాజగురువు చెప్పడం, అక్కడకు వెళ్లేందుకు అడ్డంకులు రావడంతో అది సాధ్యం కాకపోవడం తెలిసిందే.
విశాఖపట్నం వెళ్లకపోవడం వల్లే తన గ్రాఫ్ పడిపోతున్నదని కూడా ఆయన బలంగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నది. ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలు ఎక్కువ కావడం, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకోవడం తదితర అంశాలన్నీ విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తే ఆగిపోతాయని కూడా ఆయనకు రాజగురువు చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. అందుకే కోర్టులలో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా తాను విశాఖపట్నం
వెళ్లిపోతున్నట్లు సీఎం జగన్ చెప్పడమే కాకుండా విశాఖపట్నం రాజధాని అని ఆయన విస్పష్టంగా ప్రకటించేశారు. ఇంత కాలం మూడు రాజధానులు అని, అధికార వికేంద్రీకరణ అని చెబుతూ వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఒకే రాజధానిగా విశాఖ పట్నంను ప్రకటించేసింది. అమరావతి నుంచి రాజధానిని కదిలించి విశాఖపట్నంలో పెడితే తప్ప తన జాతకం మారదని ఆయన భావించడం వల్లే ఇంత సాహసానికి ఒడిగడుతున్నారని అంటున్నారు.
బహుశా వచ్చే నెల మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముంది. గత వారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో త్వరలోనే తాను విశాఖకు మకాం మారుస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్ ఆఫీసు కోసం భవనాల అన్వేషణ జరుపుతోంది.
దీనిని రుషికొండపైన నిర్మిస్తున్న పర్యాటకశాఖ ప్రాజెక్టు భవనాల్లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ వచ్చే నెల మూడో వారానికి రుషికొండపై నిర్మాణాలు పూర్తికావని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో తాత్కాలికంగా రుషికొండ, ఐటీ హిల్స్, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నాలుగైదు భవనాలను పరిశీలించారు. బీచ్ రోడ్డులోని కొన్ని భవనాలతోపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్ బంగ్లాలను కూడా పరిశీలించారు. ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది.