భారతీయ వారసత్వానికి, ప్రేమ తత్త్వానికి, జ్ఞాన, ధ్యాన యోగ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ శివానందమూర్తి. నిన్నమొన్నటి వరకూ మన మధ్యే నడచి, వెలుగులు పంచిన పుణ్యమూర్తి ఆయన. శ్రీ శివానందమూర్తి తండ్రి వీర బసవరాజు గారు, మా తాతగార్లు కొప్పరపు కవులు చాలా ఆత్మీయులు.
వారి కుటుంబంతో మాకు 100ఏళ్ళ పైన అనుబంధం ఉంది. భావరాజు వారి బావమరిది…..అంటూ బసవరాజుగారిపై కొప్పరపువారు పద్యాలు చెప్పినట్లుగా శివానందమూర్తి గారే స్వయంగా నాకు చెప్పారు. కందుకూరి వారు ఉర్లాము ( శ్రీకాకుళం జిల్లా) సంస్థానాధీశులు. వేదవిద్యకు ఎంతో సేవ చేసిన జమీందారీ అది.
జమీందారీ చేసినా భూస్వామ్య, ఫ్యూడల్ ఛాయలు రవ్వంత కూడా వారిలో కనిపించవు. అందరినీ ప్రేమించే సామ్యవాదం వారిసొత్తు. నా భాగ్యగరిమచే శివానందమూర్తిగారితో ఎన్నో ఏళ్ళపాటు గంటల తరబడి గడిపిన అద్భుత కాలం నాకు దక్కింది.
ఎన్నో విశేషాలు, విషయాలు.. వారు చెబుతూ ఉండేవారు. ఒకసారి వారిని Art of living కోసం అడిగాను…. I don’t know what it is… I am interested in Art of leaving…. అన్నారు… వారు అన్నట్లుగానే యోగమార్గంలోనే భౌతికశరీరం వదిలి వెళ్లిపోయారు. వారి తండ్రి గారు కూడా 104సంవత్సరాలు అద్భుత ఆరోగ్యంతో జీవించారు.
తనువు చలించడానికి శివానందమూర్తి గారి తోనే ముహూర్తం పెట్టించుకుని, యోగమార్గంలో వెళ్లిపోయారు. భీమ్లీ ప్రాంతంలో ఉండే పేదల కోసమే ఎక్కువ ఆలోచించేవారు. జర్నలిజం అంటే చాలా ఇష్టం. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం సభలకు ప్రారంభం రోజుల నుండి, వారు జీవించి ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం వచ్చారు. వారు అగ్రాసనాధిపతిగా ఉండి, ఆశీస్సులు అందించి, సభలను నడిపించారు.
వారు పాల్గొన్న చివరి సభ 2013- నేదునూరి కృష్ణమూర్తిగారి పురస్కార సభ. వారి భౌతిక జీవన ప్రయాణం చివరి ఘడియల్లో వరంగల్ వెళ్లి, వారిని దర్శించి, ఆశీస్సులు పొందాను. సాక్షాత్ శివస్వరూపంగా భావించే ‘సద్గురు’ దివ్య వీక్షణలు దివ్య లోకాలనుండి మనపై ఎప్పుడూ ఉంటాయని భావిస్తూ, వారి దివ్య స్మృతిలో….
మాశర్మ
(సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి పుణ్యజయంతి సందర్బంగా వారి దివ్య స్మృతిలో)