స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితి అదుపులో ఉన్నందున ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదనే విషయం వారు వెల్లడించారు. అన్ని గుర్తింపు పొంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించామని, సభలు,సమావేశాలు నిర్వహించుకోవడానికి సింగిల్ విండో అనుమతి ఇవ్వాలని కోరారని అన్నారు.
ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సిబ్బంది ఉన్నారని, అవసరమైతే, గ్రామ కార్యదర్శులు, అంగన్ వాడీలను వినియోగిస్తామని వివరించారు. పరీక్షలకు ఇబ్బందులు లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు.