ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలవబోతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన ఫిర్యాదు చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టేసినా కూడా తనను విధినిర్వహణ చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన గవర్నర్ కు నివేదించనున్నారు. రాజ్యాంగ సంస్థలను, రాజ్యంగ పోస్టులలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని డాక్టర్ రమేష్ కుమార్ విన్నవించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించడానికి ఆయన పదవీ కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్సును రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. దాంతో రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన బాధ్యతలు చేపడుతూ ఇచ్చిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనందని హైకోర్టు తీర్పులో ఉందని, అందువల్ల రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదని అడ్వకేట్ జనరల్ అసాధారణంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళుతున్నామని ఆయన ముందుగానే ప్రకటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లగా అక్కడ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే ఆ విధంగా చేయడం లేదు. ఇదే విషయాన్ని రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు.