ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో రెండో దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్కు ఆమోదం లభించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకోగా.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. దీంతో పాటు నేపాల్లో చైనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, పొరుగు దేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ రెండో దశకు ఆమోదం తెలిపింది. దాదాపు 12 వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం ఖర్చు చేయనున్నారు. ఈ పథకం ద్వారా 10,750 సర్క్యూట్ కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్ వేయనున్నారు. ఫేజ్ 2 కింద, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ వంటి 7 రాష్ట్రాల్లో ట్రాన్స్మిషన్ లైన్లు వేయనున్నారు.
రెండో దశ 2021-22 నుండి 2025-26 వరకు కొనసాగుతుంది. మొత్తం ఖర్చులో కేంద్రం నుంచి వచ్చే సాయం 33 శాతం. అంతర్జాతీయ సంస్థ కేఎఫ్డబ్ల్యూ నుంచి అదే వాటాను రాష్ట్రాలకు రుణం రూపంలో అందజేస్తారు. అదే సమయంలో మొదటి దశలో 80 శాతం పనులు పూర్తయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
మొదటి దశ వ్యయం రూ.10 142 కోట్లు.. కాగా, ఈ ప్రాజెక్టులు శిలాజ రహిత వనరుల నుండి విద్యుత్ పొందే లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక మైలురాయిగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో, ఉత్తరాఖండ్లోని ధార్చులలో మహంకాళి నదిపై భారత – నేపాల్ మధ్య వంతెన నిర్మాణానికి మంత్రివర్గం మరొక నిర్ణయంలో ఆమోదం తెలిపింది.