ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన 6.111 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్కు విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, లోక్సభా పక్ష నేత పివీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో వారు సింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీల బృందం మంత్రికి సమర్పించింది. అందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీజెన్కోకు చెల్లించాల్సిన బకాయిలలో జరుగుతున్న జాప్యం పట్ల విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పవర్ గ్రిడ్ ఆదేశాల మేరకు ఏపీజెన్కో విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుంచి 2 జూన్ 2014 నుంచి 10 జూన్ 2017 వరకు తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసింది. ఈ బకాయిలను ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏపీజెన్కోకు చెల్లించలేదని వినతి పత్రంలో వివరించారు.
తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఏపీజెన్కో నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాను కొనసాగించినట్లు విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. అయినప్పటికీ ఏపీజెన్కోకు బకాయిలు చెల్లించేందుకు తెలంగాణ డిస్కంలు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. నవంబర్ 8, 2021న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చల్లో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవలసిందిగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు సూచించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే తెలంగాణకు విద్యుత్ సరఫరా జరిపినందున ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయించే బాధ్యత కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖపైనే ఉందని వినతిపత్రంలో స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నందున ఈ బకాయిల చెల్లింపునకు చాలా ప్రాధాన్యత ఉందని వివరించారు. కాబట్టి త్వరితగతిన బకాయిలు చెల్లించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోని పక్షంలో కేంద్ర తెలంగాణ వాటాగా విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచి వాటిని మినహాయించి ఆంధ్రప్రదేశ్కు చెల్లించాలని విజయసాయి రెడ్డి కోరారు.