గతంలో ఏపీలోని బెజవాడ శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం ఈఓగా పని చేసి…ఆలయంలో క్షద్ర పూజలు జరిగాయన్న ఆరోపణలతో సస్పెన్షన్ కు గురై మళ్లీ విధులలో చేరిన ఐఏఎస్ అధికారిణి సూర్యకుమారీ కొద్ది నెలల క్రితమే రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా కలెక్టర్ నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు..అటు నెటిజన్లను ఇటు యువతీ యువకులను వాళ్లతో పాటు వారి కన్నవాళ్లను ఆలోచనలలోకి నెట్టేసాయనే చెప్పాలి. జ్ఞాన సముపార్జనకు సోషల్ మీడియా అడ్డంకిగా మారిందని…ఇకకన్నవాళ్ల ఆశీర్వాదం, గురువు ప్రసన్నం చాలా ముఖ్యమంటూ స్థానిక జేఎన్టీయూలో జరిగిన స్వీప్ అవగాహన సదస్సులో కలెక్టర్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే అందరికీ ఓటు గుర్తు రావటం శోచనీయమని, ముందుగానే ఓటరు జాబితా చూసుకోవాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని గుర్తు చేశారు.
స్థానిక జేఎన్టీయూలో నిర్వహించిన స్వీప్ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేయించుకోవాలని, దాన్ని ప్రాథమిక బాధ్యతగా అందరూ భావించాలని పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల సమయంలో వినియోగించుకొనే సాధనం కాదని, అది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రత్యేక హక్కు అని గుర్తు చేశారు.
ఈ క్రమంలో కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. రాజకీయ, సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత తరం సోషల్ మీడియా ప్రభావం చాలా ఉందని, అది జ్ఞాన సముపార్జనకు అడ్డంకిగా మారిందని కాస్త ఆవేదన వ్యక్తం చేసారు..జిల్లాకలెక్టర్.
నిర్ధారణ కాని ఎన్నో అంశాలు తప్పుడు సమాచారంగా మారి అందరినీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాజకీయాల్లోకి, సివిల్ సర్వీసెస్లోకి ప్రవేశించాలంటే ఏం చేయాలని కొంత మంది విద్యార్థులు అడగగా… దేనీకి షార్ట్కట్ లేదని.. కష్టపడి చదవటం.. ఆశాభావంతో ప్రయత్నించటమే మార్గమని కలెక్టర్ బదులిచ్చారు.
కన్నవాళ్ల ఆశీర్వాదం, గురువు ప్రసన్నం చాలా ముఖ్యమని అవి లేకుండా ముందుకెళ్లినా విజయం చేకూరదని ఉద్భోద చేశారు. జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి ఓటు నమోదుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఓటరు హెల్ప్లైన్ యాప్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఓటు హక్కు రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు నమోదు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ జె. వెంకటరావు, ఎస్డీసీ పద్మావతి, జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య, జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు, విజయనగరం తహశీల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు, జేఎన్టీయూ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.