రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీపై సాగుతున్న ప్రతికూల ప్రచారానికి పకడ్బందీగా అడ్డుకట్ట వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం బలోపేతానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యులకు ‘సోషల్ మీడియా వ్యూహం’పై అవగాహన కల్పించింది. మరోవైపు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికల వినియోగంపై అవగాహన కలిగిన వేయి మంది కార్యకర్తలను గుర్తించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలను ఆదేశించింది. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లోనూ సామాజిక మాధ్యమాల ద్వారా సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వ్యతిరేక పోస్టులు పెరిగే అవకాశం ఉన్నందున దీన్ని తిప్పికొట్టేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రతీ ఓటరుకు సామాజిక మాధ్యమాల ద్వారా చేర్చేందుకు అవసరమైన ప్రణాళికపై కసరత్తు చేస్తోంది.
ప్రతీ వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జీలను నియమించి ఫోన్ నంబర్లతోసహా వారి వివరాలను తెలంగాణభవన్లో అందజేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. టీఆర్ఎస్కు రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షలమంది సభ్యులు ఉండగా, వీరిలో నియోజకవర్గానికి 2 వేల నుంచి 3 వేల మందిని ఇన్చార్జీలుగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిలోంచి సోషల్ మీడియా వినియోగంపై అవగాహన ఉన్న వేయిమందిని గుర్తించి నియోజకవర్గ స్థాయిలోనే శిక్షణ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సోషల్ మీడియా సన్నాహాలు చేస్తోంది. పార్టీపట్ల అసత్య ప్రచారం చేస్తున్నవారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో శిక్షణ ద్వారా అవగాహన కల్పించనుంది. సోషల్ మీడియా వేదికల్లో ఉన్న సాంకేతిక అవకాశాలను కూడా ఉపయోగించుకుని అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలను బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేయడంపైనా శిక్షణ ఇస్తుంది.