రాబోయే కాలంలో కూడా క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తామని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తెలిపారు.
జాతీయ స్థాయి కుస్తీ పోటీలలో సత్తా చాటి విజేతలుగా నిలిచి అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించిన వారిని గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియా ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన నేషనల్ గ్రప్ల్లింగ్ (రెజ్లింగ్) ఛాంపియన్షిప్ పోటీలలో గచ్చిబౌలి డివిజన్ నానక్ రామ్ గుడా కు చెందిన యువకులు ధన్ రాజ్ సింగ్ 84 కేజీల విభాగంలో బంగారు పతకం, శివా సింగ్ 92 కేజి ల విభాగంలో కాంస్య పతకం , రేగుల నరేందర్ 100 కేజీల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్న వారిని సత్కరించడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
మసీదు బండలోని కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మన తెలంగాణ గౌరవం దేశ నలుమూలల తెలిసేలా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి క్రీడాకారులు పలు క్రీడలలో సత్తా చాటుతున్నారన్నారు.
ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలియజేశారు. మన రాష్ట్రంలో వివిధ క్రీడలలో ఎంతో మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారనీ అలాంటి వారిని గుర్తించి ప్రోత్సాహం ఇవ్వవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని సూచించారు.
క్రీడారంగంలో నైపుణ్యం ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని రాబోయే కాలంలో కూడా క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తామని తెలియజేశారు. యువత చదువుతోపాటు క్రీడారంగంలో కూడా రాణించి సమాజానికి,తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.