దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తమ వంతు సాయంగా పలు సంస్థలు విరాళాలు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
లాక్ డౌన్ సమయంలో కూడా వేలాది మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, మునిసిపల్ సిబ్బంది, వీరందరికి సహకరిస్తూ పోలీసులు పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్ననిర్ణయాలు, వేలాది మంది చేస్తున్న శ్రమ కారణంగా కరోనా వ్యాప్తికి సంబంధించి మంచి ఫలితాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీ చైతన్య విద్యాసంస్థలు తమ వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ప్రకటించాయి. తెలంగాణా సీఎం కేసీఆర్ కు కోటి రూపాయల చెక్కును నేడు శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ అందచేశారు.
అదే విధంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందచేశాయి. ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి యాభై లక్షల రూపాయలు, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వానికి 25 లక్షల రూపాయలు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి 25 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చాయి. మొత్తం శ్రీ చైతన్య విద్యాసంస్థలు నాలుగు కోట్ల రూపాయల విరాళాలు అందచేశాయి.