రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పినా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించినా కూడా తనను బాధ్యతలు చేపట్టనివ్వడం లేదని ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని రమేష్ కుమార్ రాష్ట్ర హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర హైకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టి, గవర్నర్ ను కలిసి వినతి పత్రం సమర్పించమని రమేష్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది. రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలుసుకుంటున్న తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. రాష్ట్ర హైకోర్టులో రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది.