వరద సహాయం నిలిచిపోయింది.. ఎప్పుడెప్పుడొస్తాయా అని ఆశగా ఎదురు చూసిన నిరుపేదల ఆశలు అడియాశలే అయ్యాయి. ఓ వైపు ఆర్థిక సహాయం అందక నిజమైన నిరుపేద లబ్ధిదారులు ఊసురుమంటుంటే.. ఇంకోవైపు అధికార, ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటూ బురద రాజకీయాలకు పాల్పడటం శోచనీయం. మీరంటే మీరే ఆపేశారని టీఆర్ఎస్ బీజేపీపై చిందులు తొక్కుతుండగా, మరోవైపు గులాబీ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని దేనికైనా తాము సిద్ధమేననే ప్రతిసవాళ్లు కమలం నుంచి వినిపిస్తున్నాయి.
వరద సహాయం ఆగిపోవడం నిజాలు..
ఓ వైపు వరద సహాయం అందిస్తుండగానే ఎన్నికలకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవ్వడం అన్నిఏర్పాట్లను చేస్తుండడం, దీనికి తోడు ఎలక్షన్ కమిషన్ కూడా జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ వెలువరించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ రాష్ర్టంలోనైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెలువడితే ఎమర్జెన్సీ (అత్యవసర) పనులు మినహా పార్టీ నుంచి ఆయా ప్రభుత్వం నుంచి చేపట్టే ఎలాంటి కార్యక్రమాలనైనా నిలిపివేస్తారనే విషయం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి తెలియదా? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. లేక అంతా తెలిసే ఇది జరిగిందా?
ఇక ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ వరద సహాయాన్ని ఆపివేయించాయని ఇందుకు సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల విన్నపం మేరకే నగదు సహాయం ఆపేశామని ఈసీ కుండబద్ధలు కొట్టింది. అంటే ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని ఆపకుంటే మరెవరు ఆపినట్లు? అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది.
ఏది ఏమైనా అన్ని పార్టీలు కలిసి నిరుపేదల పొట్ట కొట్టాయనేది వాస్తవం. ఇందులో ఎలాంటి సంశయం లేదు.