సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కొందరిని తీవ్రంగా విమర్శిస్తూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పై రేపు విచారణ జరగనున్నది.
ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు కాగా వాటిని విచారించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు యు లలిత్ ఈ విచారణను నిర్వహిస్తారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను విమర్శించే హక్కు అధికారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేవని, న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని కోరుతూ న్యాయ వాది జి ఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నది.
రాజ్యాంగ పదవిలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిధిని దాటి న్యాయవ్యవస్థ పై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారని, రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు సాహసించారని పిటిషనర్ ఆరోపించారు. న్యాయవ్యవస్థ పట్ల భారత దేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేసే విధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ తర్వాత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, కొన్ని కేసులు కోర్టు విచారణ పరిధిలో ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి న్యాయవ్యవస్థ పై బురద చల్లేందుకు ఈ విధమైన ఆరోపణలు చేశారని పిటిషనర్ తెలిపారు.
రెండో పిటిషన్ ను సునీల్ కుమార్ సింగ్ తరపున ఎడ్వకేట్ ఆర్ రికార్డ్ ముక్తి సింగ్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా లేఖలు రాసి వాటిని బహిరంగ పరచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆయన కోరారు.