గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ మహరాజ్
శ్రీశైల క్షేత్రంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో రాజకీయం చేయడం తగదని గాంధారి మండలం గుడిమెట్ మహాదేవుని ఆలయ పీఠాధిపతి మహాదేవ్ మహరాజ్ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. లక్షల సంవత్సరాలు, యుగయుగాల చరిత్ర కలిగిన మహా జ్యోతిలింగ క్షేత్రమే శ్రీశైలం క్షేత్రమన్నారు. అలాంటి క్షేత్రంలో కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసి రెండున్నర కోట్లతో కరపత్రాలు, పత్రికలకు ఖర్చు చేసి ఇప్పుడు అర్దాంతరంగా బ్రహ్మోత్సవాలను ఎందుకు రద్దు చేసారని ప్రశ్నించారు.
బ్రహ్మోత్సవాల తేదీలను ముందుకు ఎందుకు జరుపుతున్నారన్నారు. పవిత్రమైన క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసి రద్దు చేయడం చాలా తప్పు అని పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రారంభించే ముందు గాని, రద్దు చేసే ముందు గాని అక్కడి స్వాములు, జగద్గురువులకు సమాచారమిచ్చారా అని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాలు నిర్వహించి లోక కల్యాణానికి సహకరించాలని, పాపాన్ని మూట కట్టుకోవద్దని అక్కడి ప్రభుత్వానికి, ఆలయ ఈఓలకు సూచించారు. రాజకీయాలకు తావు లేకుండా ఉత్సవాలను యధావిధిగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహరాజ్ శిష్యులు ఆకాష్ స్వామి, విశ్వేశ్వర్ స్వామి, రాకేష్ స్వామి, యోగ గురువు బండి రాములు పాల్గొన్నారు.