నిజాంసాగర్, అప్పర్ మానేరు ప్రాజెక్టుల రిజర్వాయర్ బెడ్ (శిఖం) భూములను రెవెన్యూ, నీటిపారుదల, సర్వే ల్యాండ్ శాఖలు జాయింట్ సర్వే చేపట్టి పది రోజులలో నివేదిక సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఆదేశించారు. మంగళవారంనాడు తన ఛాంబర్ లో తహశీలుదార్లు, నిజాం సాగర్, అప్పర్ మానేరు డ్యాంల ఇంజనీర్లు, జిల్లా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, సర్వే ల్యాండ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాయింట్ సర్వే టీమ్ లుగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో భూములను గుర్తించాలని కలెక్టర్ కోరారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లారెడ్డి మండలంలో 6860 ఎకరాలు, నిజాంసాగర్ మండలంలో 428 ఎకరాలు, నాగిరెడ్డి పేట మండలంలో 2172 ఎకరాలు ఉందని, అప్పర్ మానేరు ప్రాజెక్టుకు సంబంధించి బీబీ పేట మండటంలో 1446 ఎకరాలు, మాచారెడ్డి మండలంలో 256 ఎకరాలు, దోమకొండ మండలంలో 306 ఎకరాలు ఉందని ఆయన తెలిపారు.
వీటిని క్షేత్ర స్థాయిలో సర్వే చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఆర్ డి ఓ కామారెడ్డి నరేందర్, నీటిపారుదల శాఖ ఇఇ బన్సీలాల్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నిజాం సాగర్ దత్తాద్రి, సర్వే ల్యాండ్ శాఖ సర్వే ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఇంజనీర్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వరప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.