మంగళగిరి పట్టణంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వదంతులు వినిపిస్తున్నాయి. పిల్లల్ని అపహరించే ముఠా తిరుగుతోందన్నప్రచారం ప్రజల్నికంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని పార్కు రోడ్ చివర ఉన్నయాదవ బజారులో అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తలుపులు కొడుతూ, కుక్క అరిచినట్లు అరవడం, పిల్లలు ఏడ్చినట్లు శబ్దాలు చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అలానే రెండు రోజుల క్రితం రాత్రి రాజీవ్ సెంటర్ లో ఇదే తరహాలో జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో స్థానిక యువకులు కర్రలు పట్టుకుని గస్తీ తిరిగినట్లు చెబుతున్నారు. చెడ్డీ గ్యాంగ్, మిడ్డీ గ్యాంగ్ అంటూ స్ధానికులు అమాయకులను కొట్టి చంపక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అనుమానిత ప్రాంతాలతో పాటు, పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఎస్ ఐ స్థాయి అధికారితో రాత్రి గస్తీలను ముమ్మరం చేసి అనుమానితులను విచారిస్తే కొంత మేర ప్రజలు ధైర్యంగా ఉంటారు. అలానే ప్రయివేటు వ్యక్తులు కర్రలు పట్టుకుని తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని అన్నికూడళ్లలోని సీసీకెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అనుమానితుల సంచారంపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంత మేరకైనా ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే అర్థరాత్రులు విధులు ముగించుకుని వచ్చే వారిని దొంగలుగా భావించి దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.