తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం కాలిపోయిన సంఘటనపై సీబీఐ దర్యాప్తును కోరాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.
కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దాంతో సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర హోం శాఖకు రాష్ట్ర డిజిపి లేఖ రాశారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.
ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ రేపు జీవో వెలువడనుంది.