కరోనా విపత్తు సమయంలో ప్రజల ప్రాణాల రక్షణ పట్టించుకోకుండా తన రాజకీయ కక్ష తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వాడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ని అరెస్ట్ చేశారని, జగన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం లేదని 5 కోట్ల ఆంధ్రులూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు, వారందరినీ అరెస్ట్ చేస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్క చేయకుండా..వై కేటగిరి భద్రతలో వుంటూ ఇటీవలే బైపాస్ సర్జరీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయన పుట్టినరోజు నాడే అరెస్ట్ చేయించడం కరెక్టు కాదని లోకేష్ అన్నారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువల్ డిపార్ట్మెంట్ గా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేరకపోతే జేసీబీతో ధ్వంసం, లొంగకపోతే పీసీబీ తనిఖీలు, ఇదీ జగన్రెడ్డి పాలన అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
previous post