వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కె. రఘు రామకృష్ణం రాజు కేసులో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను కూడా పోలీసులు సహ నిందితులుగా చేర్చారు. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా కేసును సవరించారు. రఘురామ కృష్ణంరాజును నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు జిల్లా మంగళగిరికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణంరాజు ప్రధాన నిందితుడుగా నిన్న ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. కుల,మత, వర్గాలను టార్గెట్ చేసుకుని ప్రజలను రెచ్చగొట్టేలా రఘురామకృష్ణరాజు చర్యలు ఉన్నాయని పోలీసులు అభియోగాలు మోపారు. టీవీ5,ఏబీఎన్ తో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు సీఐడీ పేర్కొన్నది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా టీవీ5, ఏబీఎన్ తో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నినట్లు సీఐడీ పేర్కొన్నది.