రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న అందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఆశాజనక ఫలితాలు సాధించాలంటే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం అర్బన్ పరిధిలోని జగనన్న కాలనీల్లో జరిగే ఇళ్ల నిర్మాణాలు, ఇతర ప్రక్రియలపై కలెక్టరేట్ మీటింగ్ హాలులో జేసీ హౌసింగ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు పాల్గొని పనుల పురోగతికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఇవ్వడానికి సంకల్పించిందని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో త్వరితగతిన పనులను పూర్తి చేసి ఇళ్లు ఇవ్వడానికి ప్రత్యేక దృష్టిసారించి ఒక ఐఎఎస్ అధికారిని కూడా కేటాయించిందని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం అక్కడ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని అధిగమించి ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇటు అధికారులపై, అటు ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిబంధనలు, మార్గదర్శకాలు ప్రజాప్రతినిధులకు చేరటం లేదని, దీని పరిష్కారానికి జేసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
లేఅవుట్లలో కనీస వసతులు కల్పించాలని, ఎవరైనా వెళ్లినప్పుడు ఉండటానికి, కూర్చోడానికి అనువుగా షెడ్డు ఎదైనా నిర్మించాలని, తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని, అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.అనంతరం జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు జరిగేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
లబ్ధిదారుల నుంచి వచ్చే సమస్యలను స్వీకరించేందుకు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే పట్టణం నుంచి లేఅవుట్ల వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు, హౌసింగ్ కమిటీ సభ్యులకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకా కాలనీల్లో జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన విధివిధానాలపై, నిబంధనలపై లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రమణమూర్తి, విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, హౌసింగ్ కమిటీ సభ్యులు రాజేశ్, తవిటిరాజు, శ్రీనివాస్, మురళీ, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.