శామీర్పేట తూంకుంట పరిధిలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్ అసోషియేషన్ జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 విభాగంలో బాలబాలికలకు నిర్వహించిన పరుగుపందెం, దూకుడు ఈవెంట్లకు అనూహ్య స్పందన లభించిందని ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడు ప్రభుకుమార్గౌడ్, నిర్వాహక కార్యదర్శి కూరపాటి రాజశేఖర్లు తెలిపారు.
ఈ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి జాతీయ అబ్లెటిక్స్ టెక్నికల్ కమిటి చైర్మన్ స్టాన్లీజోన్స్ ముఖ్య అతిధిగా విచ్చేసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం క్రీడాకారులను ఎంపిక చేయటం ఈ “సెలక్షన్స్ ముఖ్య ఉద్దేశమని, మారుమూల ప్రాంత క్రీడాకారులు ముందుకు వచ్చి ఈ పోటీలలో పాల్గొనటం చాలా శుభపరిణామన్నారు. గ్రాస్రూట్ లెవల్ పిఇటి టిచర్లు విద్యార్థులకు తగిన విధంగా కోచింగ్ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయస్తాయి క్రీడా కారులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
మేడ్చల్ జిల్లాను క్రీడారంగంలో ముందుకు తీసుకువెళ్ళాలని కోరారు. మేడ్చల్ జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రభుకుమార్గౌడ్, క్రీడల కన్వీనర్ రాజశేఖర్లు మాట్లాడుతూ ఈ నెల 10, 17, 24వ తేదీలలో ఖమ్మం, సూర్యపేట, నల్లగొండ, హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గోనే మేడ్చల్ జిల్లా జట్టును ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందని వివరించారు.
ఈ ఎంపికలు పూర్తి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించామని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి 150 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు. అలాగే ఈ క్రీడలను 10 నెలల తర్వాత నిర్వహిస్తామన్నారు. దీనిపట్ల క్రీడాకారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎంపిక కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రాజు, సభ్యులు లవకుమార్గౌడ్, టెక్నికల్ మెంబర్స్ అశోక్, లక్ష్మీనారాయణ, ‘ప్రభుదాస్, హర్ష, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.