విజయనగరం జెఎన్టియు గురజాడ విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో స్థాపించడం, విద్య ఉద్యోగావకాశాల్లో మేలు మలుపు లాంటిదని జేఎన్టీయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.స్వామినాయుడు అన్నారు. ఈ విశ్వవిద్యాలయం వల్ల విజయనగరానికి విద్యల నగరం అన్న పేరు సార్థకమవుతుందనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
స్థానిక జెఎన్టియుకె విజయనగరం క్యాంపస్ను, ఇటీవలే ప్రభుత్వం జెఎన్టియు గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయంగా మార్పు చేసిన నేపథ్యంలో, యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్లంతా హర్షాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. 2007లో జెఎన్టియు కాకినాడ ప్రాంగణంగా ఏర్పాటైన ఈ కళాశాల, ప్రత్యేక సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఎదిగిన ప్రస్థానాన్ని వివరించారు.
ప్రస్తుతం ఐదు ఇంజనీరింగ్ కోర్సులు, ఆరు ఎంటెక్ కోర్సులతోపాటు, ఎంఎసిఏ కూడా ఉందని చెప్పారు. వివిధ కోర్సుల్లో ఏటా సుమారు 540 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నామని, ప్రస్తుతం 1800 మంది విద్యార్థులు, 250 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని తెలిపారు.
ఇకనుంచీ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాంకేతిక కళాశాలన్నీ, ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని చెప్పారు. విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయడం వల్ల, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రిన్సిపాల్ చెప్పారు. ఇకనుంచీ మెరిట్ విద్యార్థులు కాకినాడ క్యాంపస్కు బదులు ఇక్కడే చేరుతారని, విద్యాప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని, పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
కొత్తకొత్త కోర్సులు ప్రారంభమవుతాయని, అదనంగా అవసరమైన అధ్యాపకులు, సిబ్బంది నియామకం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద కంపెనీలతో ఎంఓయులు జరుగుతాయని, క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా విద్యార్థులకు మెరుగైన జీతాలతో ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. నైపుణ్యం, ఉన్నత విద్యార్హతలు ఉన్న మానవ వనరుల లభ్యత కారణంగా, సమీప ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.
యూనివర్సిటీకి నిధులు కూడా మంజూరు కావడం వల్ల, అభివృద్దికి ఆస్కారం కలుగుతుందన్నారు. జాతీయ రహదారి నుంచి యూనివర్సిటీకి డబుల్ రోడ్డు మంజూరయ్యిందని, కొత్తగా ఆడిటోరియం, పరిపాలనా భవనం, ల్యేబరేటరీలు, ఎగ్జామ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని డాక్టర్ స్వామినాయుడు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ప్రొఫెసర్ జి.జయసుమ, ప్రొఫెసర్ కెసిబి రావు, ప్రొఫెసర్ కె.బాబులు, డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, యూనివర్సిటీ మంజూరు చేసినందుకు సీఎం జగన్ కు, అందుకు కృషి చేసిన జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.