తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి సేవలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఒక నిర్ణయానికి వచ్చారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యలతో అత్యంత వివాదాస్పదంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఒక వైపు ఏకగ్రీవాలపై ఫిర్యాదులు, మరోవైపు నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు.. ఇలా ఎన్నికల సంఘానికి పనిభారం పెరిగిపోయింది.
మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైన ఏపీ ఎస్ఈసీ ఇప్పుడు ఇలా ఇతర రాష్ట్రాల ప్రత్యేక పరిశీలకుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన మాజీ ఎన్నికల కమిషనర్లు మరియు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్లుగా పనిచేస్తున్న వారి సేవలను వినియోగించుకోవడానికి… వారిని ఆహ్వానించాలని గత ఏడాది నవంబర్ 6వ తేదీన జరిగిన ఎస్ఈసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించిందని.. ఢిల్లీ, ఛండీఘడ్, మహారాష్ట్ర, మిజోరాం, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాలతో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉందని.. దేశంలో అందుబాటులో ఉన్న ప్రతిభను వాడుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందని ప్రకటనలో పేర్కొంది ఎస్ఈసీ.