పాడి పరిశ్రమ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, సర్కారు చేయూతను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5.6 కోట్లతో ఆధునీకరించిన విజయ పాలశీతలీకరణ కేంద్రం, పాల ఉత్పత్తుల కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. సీయం కేసీఆర్ పాడి పరిశ్రమ అభివృద్దికి తీసుకుంటున్న చర్యల వల్ల విజయ డెయిరీ బలోపేతమైందన్నారు. డెయిరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా అనేక పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. పాడి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.
టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గా లోక భూమా రెడ్డి ఈ పరిశ్రమ అభివృద్దికి ఎంతో నిబద్దతతో కృషి చేస్తున్నారని, అనేక సార్లు సీయం కేసీఆర్ లోక భూమా రెడ్డి పేరును ప్రస్తావించడమే దీనికి నిదర్శనమన్నారు. విజయ డెయిరీని లాభాల బాటలో నడిపిస్తున్న లోక భూమా రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. అదిలాబాద్ జిల్లాకు తలమానికంగా విజయ డెయిరీ యూనిట్ ను నిలిపేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్,మాజీ ఎంపీ నగేశ్, మత్స పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్ర, ఎండీ శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్ తదితరులు పాల్గొన్నారు.