నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని వింజమూరు గ్రామంలో తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు నారి ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనేఅని ఆయన అన్నారు. చిన్నపిల్లలు సైతం వరిసెలతో రాళ్ళు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారని ఆయన తెలిపారు.
నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాల పైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగల బెట్టి నానా అరాచకాలు సృష్టించారని, మతోన్మాద చర్యలు కోరలు చాచి వెయ్యి నాల్కలతో విషంకక్కాయని ఆయన తెలిపారు.
హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి నిజాం నవాబు అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవాడని ఐలయ్య తెలిపారు.
నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణమని తెలియ చేశారు. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు.
రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు.
నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారని ఆయన తెలిపారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకొని భారత కమ్మ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధరంగంలోకి దిగిన ప్రజలు రజాకార్ల మూకలను తరిమికొట్టాయని ఆయన తెలిపారు.
ఆ రోజు నిజాం తో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా విముక్తి చేసామో ఇప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీ దొరల చేతుల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రం కు కాడా విముక్తి కలిగిస్తుందని అన్నారు.
బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం చేతి కొస్తే తప్ప పేదల బ్రతుకులు మారవని అన్నారు. ఉడుగుండ్ల రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామవత్ లక్ష్మణ్ నాయక్, పోలే యాదయ్య, సర్దార్ బాయ్,పెద్దయ్య, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.