కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులను విజయదశమి నాడు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది కాలంలోనే కొత్త భవనం సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా నాటిని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది.
భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. డెక్కన్ కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం ఎత్తు 278 అడుగులు.
ఇందులో మధ్యభాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తు 111 అడుగులు. ఇక గుమ్మటంపై 11 అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర ఉంటుంది. భవనం పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్ నిర్మిస్తున్నారు. ఈ స్కైలాంజ్ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దానిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం పైభాగం ఉంటుంది.
సచివాలయానికి మూడు వైపులనే రోడ్డు ఉంది. కానీ కొత్త సచివాలయ భవనానికి వెనక వైపు కూడా రోడ్డు నిర్మించనున్నారు. మింట్ కాంపౌండ్ సచివాలయం మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు.
గతంలో జీ బ్లాక్ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా ప్రధాన భవనం నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు.