టెన్షన్… టెన్షన్… టెన్షన్… ఎన్నికల ఫలితాల కన్నా ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న అంశం. భీమవరం బెట్టింగ్ రాజులు కోట్ల రూపాయలు పందాలు కాసుకోవాల్సినంత సీరియస్ అంశం. బెయిల్ రద్దు అవుతుందా? అవ్వదా? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
తుది నిర్ణయం రేపు అంటే బుధవారం వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. ఈ నెల 25న తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు అయితే పరిస్థితేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే ఈ టెన్షన్ నెలకొని ఉన్నది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏం తీర్పు చెబుతారా అని కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు నెల రోజులు కాలయాపన చేసిన తర్వాత సీబీఐ తన నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసింది. సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి.
అయితే ఇప్పుడు ఆ దశలన్నీ దాటి తుది దశకు వచ్చినందున ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ‘‘ఆగస్టు 25 ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందా?. అందరూ ఊహిస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా?. విజయసాయిరెడ్డి బెయిల్పై కూడా కోర్టు తీర్పు వెలువడుతుందా?. బెయిల్ రద్దు విషయంలో జగన్ శిబిరం ధీమాగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి రేపు సమాధానం వచ్చే అవకాశం ఉంది.