శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకుగా భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి సన్నిధిలో వసంతోత్సవం,డోలోత్సవం వేడుక జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నిండు ముత్తయిదువులు పెళ్లి పసుపుకొమ్ములు దంచారు. దేవస్థానం అధికారులు ముత్యాల తలంబ్రాలను కలిపారు. దీంతో పెళ్లి పనులు ప్రారంభమైనట్లు భావిస్తారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ప్రతి ఏటా ఈ అరుదైన వేడుకను దేవస్థానం నిర్వహిస్తోంది. గుక్క గులాలు, అత్తరు పన్నీరు,సుగంధ ద్రవ్యాలతో కూడిన వసంతాన్ని పెళ్లి కొడుకుగా ముస్తాబైన భద్రాద్రి రామునిపై అర్చకస్వాములు వసంతాన్ని చల్లారు. స్వామివారికి జోలలు, లాలతో డోలోత్సవం వేడుకను కన్నులపండువగా నిర్వహించారు.