హైదరాబాద్ శివారు ప్రాంతం అయిన రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత పులి కనిపించింది. రాజేంద్రనగర్ సమీపంలోని వ్యవసాయ యూనివర్శిటీ పరిసరాల్లో చిరుత సంచరించగా ఓ ఇంటి కాంపౌండ్లోకి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్లో కనిపించింది. దీంతో ప్రజలు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కనిపించిన చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్న అధికారులకు మళ్లీ ఆందోళన మొదలైంది. మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై కనిపించగా.. స్థానికుల్ని చూసి భయంతో రోడ్డుపై పరుగులు తీస్తూ వెళ్లి ఓ లారీ డ్రైవర్పై దాడి చేసింది.
అక్కడి నుంచి మెల్లిగా జారుకుని సమీపంలో ఉన్న ఫామ్హౌస్వైపు వెళ్లింది. ఆ తర్వాత రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది. అక్కడి నుంచి అది గగన్పహాడ్ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆ చుట్టుపక్కలే చిరుత పులి తిరుగుతుండడాన్ని అధికారులు గుర్తించారు.