శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు జరిగిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయంలోని అయిన మహల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఆలయ అర్చకులు సుదర్శన చక్రాన్ని ముంచి, పవిత్ర స్నానం చేయించారు.
ఈ సందర్భంగా ఈవో డా. కెఎస్.జవహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
సుగంధంతో స్నపన తిరుమంజనం
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం 6.00 గంటల నుండి శ్రీవారి ఆలయంలోని అయిన మహల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారని తెలిపారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారన్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవంతో శ్రీ వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించిన జీయ్యంగార్లు, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
స్నపన తిరుమంజనం సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.
ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
చక్రస్నానం – లోకం క్షేమం
తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతులతో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు.
యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.
అక్టోబరు 25న పార్వేట ఉత్సవం
అక్టోబరు 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ మలయప్పస్వామివారిని రంగనాయకుల మండపంలో వేంచేపు చేస్తారు. కోవిడ్ – 19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.