వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ వాహనదారులకు తెలియజేశారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ట్రాఫిక్ ఎస్ఐ తన ట్రాఫిక్ సిబ్బందితో కలిసి నిర్వహించారు.
అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వన్ వేలో వాహనం నడపరాదని, నో పార్కింగ్లో వాహనాలు నిలుపరాదని తెలిపారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణం చేయరాదని చెప్పారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని సూచించారు. ఈ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సురక్షితంగా వారి గమ్యం చేరుకోవాలని తెలిపారు.