రైతులకు పట్టాలు ఉన్న భూముల్లో అటవీ శాఖ అధికారులే అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అక్రమంగా ప్రవేశించడమే కాదు వారి అనుమతి లేకుండా కందకాలు తవ్వేస్తున్నారు. దాంతో రైతులు ఆక్రందనలు చేస్తున్నారు. తమను ఆదుకునేవారెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ దారుణం సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలో జరుగుతున్నది. చింతల మానేపల్లి మండలం కర్జేళ్లి గ్రామంలో రైతుల పట్టా భూముల్లో తవ్వుతున్న కందకాలను సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నేడు పరిశీలించారు.
గిరిజన రైతుల కు పట్టా ఉన్న భూములలో కూడా కందకాలు తవ్వి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలను నిలుపుదల చేయాలని లేకపోతే గిరిజన రైతులు పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని పాల్వాయి హెచ్చరించారు.
కందకాలు తవ్వే కాంట్రాక్టర్ గా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కోనేరు సాంబ శివరావు ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు తాము దౌర్జన్యం చేయడమే కాకుండా అతనికి మద్దతు ఇస్తున్నారని పాల్వాయి ఆరోపించారు. సిర్పూర్ ఎమ్మెల్యే, ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కై గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయిని భీమయ్య, ఎల్ములే మల్లయ్య, చౌదరి రంగన్న, ఉమా మహేష్, వార్డు మెంబర్ శేఖర్, శంకర్, దేవాజీ, ఫాహాద్ అహ్మద్ గ్రామస్తులు పాల్గొన్నారు.