అన్ని పోలీస్ స్టేషన్ లలోని రిసెప్షన్, టెక్ టీం సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వివిధ రకాల అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలని కోరారు.
సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి పాత్ర కీలకమైనదని, ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర వహిస్తారని తెలిపారు. రిసెప్షన్ అధికారి బాధితులతో మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. వ్రాత పూర్వక ఫిర్యాదు విషయంలో ఫిర్యాదును సూక్ష్మంగా చదివి పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టం సి.సి.టి.ఎన్.ఎస్. లో ఫిర్యాదులోని విషయాలను నమోదు చెయ్యాలని తెలిపారు.
ఫిర్యాదుల తీవ్రతను బట్టి వెంటనే స్పందించి ఎస్సై దగ్గరికి గాని తన పై అధికారులకు గాని లేదా ఇతర వర్టికల్ అధికారులకు గాని తెలియజేసి చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు. ఫిర్యాదులను ఎస్ హెచ్ వో లేదా ఇంచార్జి అధికారులతో కలిపి ఆ వివరాలను తీసుకున్న చర్యల వివరాలను సి.సి.టి.ఎన్.ఎస్. పిటిషన్ మేనేజ్మెంట్ అప్లికేషన్ లో నమోదు చేయాలని తెలిపారు.
రిసెప్షన్ వద్ద, పోలీస్ స్టేషన్ ల పరిసరాలలో 5s సిస్టంను పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేలా, అదే విధంగా తాను నిర్వహించే సిస్టం, రికార్డ్స్, ఫైల్స్ క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డి.సి.ఆర్.బి డి.యెస్.పి.నారాయణ రెడ్డి, ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.