అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి బాబూ జగజ్జీవన్ రామ్ అని ఏపీలోని ఉత్తరాంధ్రలోని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ కార్యాలయంలో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన చిత్ర పఠానికి పూలమాల వేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. అతిచిన్న వయసులోనే ఎమ్మెల్యే గా ఎన్నికైన బాబూజీ, సుమారు 30ఏళ్లపాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని కొనియాడారు.
వారి సేవలను నిరంతరం స్మరించుకొని, స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. చదువు ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించవచ్చునని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు.
ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో రాజ్యాంగబద్దమైన పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలు ప్రతీఒక్కరికీ అందుతున్నాయని అన్నారు.
ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు, అభివృద్ది ఫలాలు అందించేందుకే వివిధ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.